రాజీనామాల విషయంలో.. వైసీపీ ఎంపీలకు లోక్సభ స్పీకర్ ఆఫీస్ నుంచి పిలుపొచ్చింది. స్పీకర్ సుమిత్ర మహాజన్.. ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారా.. లేదా.. అన్నది నేడు సాయంత్రానికి తేలిపోతుంది. మరి.. వైసీపీ ఎంపీలు రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్పై ఒత్తిడి తెస్తారా.. సైలెంట్గానే ఉంటారా.. అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఏపీకి ప్రత్యేక హోదా సాధించే పోరాటంలో భాగంగా.. వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ చివరి అస్త్రంగా రాజీనామా చేశారు. కానీ.. ఇప్పటివరకు లోక్సభ స్పీకర్ వాటిని ఆమోదించలేదు. ఐతే.. తాజాగా జరిగిన కర్ణాటక ఎన్నికలతో.. వైసీపీ ఎంపీల రాజీనామా విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. బీజేపీ ఎంపీలుగా ఉన్న యడ్యూరప్ప, శ్రీరాములు.. ఎమ్మెల్యేలుగా గెలవడంతో.. వారు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ కూడా వెంటనే ఆమోదించారు. ఐతే.. స్పీకర్ ఫార్మాట్లోనే ఉన్న వైసీపీ ఎంపీల రాజీనామాను.. ఇప్పటివరకు ఎందుకు ఆమోదించలేదన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉంటేనే.. ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ.. సాధారణ ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం మాత్రమే ఉంది. అందువల్ల వైసీపీ ఎంపీల రాజీనామాలకు.. స్పీకర్ ఓకే చెప్తారా లేదా అన్నదే ఇప్పుడంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం. ఇలాంటి తరుణంలో.. వైసీపీ ఎంపీలకు స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. మంగళవారం సాయంత్రం ఎంపీలు స్పీకర్ సుమిత్ర మహాజన్ను కలవనున్నారు. ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా.. లేదా.. అన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్గా మారింది.
రాజీనామాలపై వైసీపీ సీరియస్గా ఉంటే ఇప్పటికే రాజీనామాలు ఆమోదం పొందేవని.. వైసీపీ, బీజేపీ లాలూచీలో భాగంగానే రాజీనామా డ్రామాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా ఈ ఉత్కంఠకు.. మరికొన్ని గంటల్లో తెరపడనుంది.