దివంగత మహా నటుడు ఎన్టీ రామారావు చరిత్ర గురించి క్షుణ్ణంగా చెప్పాలంటే, తాను తప్ప మరెవరూ చెప్పలేరని ఆయన సతీమణి, వైకాపా మహిళా నేత లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం ఎన్టీఆర్ మళ్లీ పుడతారన్నారు. ఎన్టీఆర్ను గౌరవించని తెలుగు సభలకు బాలకృష్ణ ఎలా వెళ్తారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ను గౌరవించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజలంతా ఎన్టీఆర్ను గౌరవిస్తారని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు.
ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా తీస్తే...ఆయనకు జరిగిన అన్యాయం కూడా బయటకు రావాలన్నారు. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా?అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఆశయాలు నిలబెట్టే అసలైన వారసురాలుని తనేనని చెప్పారు. చంద్రబాబుని గద్దె దించిన తర్వాతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె స్పష్టం చేశారు.