సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ... ట్విట్టర్ ద్వారా తనను ఆశ్రయిస్తున్న వారికి తనదైన శైలిలో న్యాయం చేస్తున్నారు. సాయం చేయాలంటూ అభ్యర్ధన పంపిన వందలాది మందికి అండగా నిలిచిన కేటీఆర్ ... తాజాగా నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై సామాన్యులకు విధించే స్ధాయిలోనే కొరడా ఝుళిపించారు. ఈ నెల23న ఎల్బీ నగర్ రింగు రోడ్డు వద్ద రాంగ్ రూట్లో వెళుతున్న పోలీస్ వాహనం ఫోటో తీసిన ఓ నెటీజన్ కేటీఆర్కు ట్వీట్ చేశారు. నిబంధనలకు సామాన్యులకేనా ? ... ప్రభుత్వ అధికారులకు వర్తించవా ? అంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందిచంచిన కేటీఆర్ ఈ విషయాన్ని పరిశీలించాలంటూ రాచకొండ పోలీసులను ట్విటర్ ద్వారా కోరారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు .. ట్రాఫిక్ ఉల్లంఘించిన డ్రైవర్ రంగన్నతో పాటు హెడ్కానిస్టేబుల్ బుగ్గ రాములుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పెట్రోలింగ్ వాహనం అయినా చలానా వేసినట్లు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండేందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ట్వీట్ ద్వారా కేటీఆర్కు తెలిపారు. పోలీసుల నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేసిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.