ముస్లింలు, గిరిజన రిజర్వేషన్ల కోసం తెలంగాణ సర్కార్ ఉద్యమాన్ని ఉదృతం చేయాలని భావిస్తోంది. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనపై స్పందించిన కేంద్రం రిజర్వేషన్లను పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రూపాల్లో ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై దృష్టి సారించారు. తెలంగాణ సర్కార్ పంపిన రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించకపోవడంతో ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు ఆమోదించాలంటూ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఎంపీల ఆందోళనకు స్పందించిన కేంద్ర మంత్రి హన్స్రాజ్ గంగారాం తెలంగాణలో రిజర్వేషన్లు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల బిల్లును ఎలాగైనా ఆమోదించుకోవడానికి ఢిల్లీ స్థాయిలో ఆందోళన చేసేందుకు రెడీ అవుతున్నారు. పార్లమెంట్లో ఆందోళన కొనసాగిస్తూనే న్యాయపోరాటం, జంతర్మంతర్ వద్ద ధర్నా, కేంద్రం లెవనెత్తిన అభ్యంతరాలకు వివరణలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. మహారాష్ట్రలో 52శాతం, తమిళనాడులో 69శాతం రిజర్వేషన్లు అమలవుతుంటే తెలంగాణలో పెంపునకు కేంద్రం అభ్యంతరం తెలపడమేంటని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానాన్ని పాటించడంపై పార్లమెంట్లో గట్టిగా నిలదీయాలని ఎంపీలకు సూచించినట్లు సమాచారం.
సుధీర్, చెల్లప్ప కమీషన్లతో పాటు బీసీ కమీషన్ ద్వారా అధ్యయనాలు చేసిన తర్వాతే పక్కా ఆధారాలతో బిల్లును రూపొందించామని కేసీఆర్ కేంద్రానికి తెలియజేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ను నిర్లక్ష్యం చేస్తే కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. త్వరలోనే జంతర్మంతర్ వద్ద తేదీలను నిర్ణయించి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నాకు రెడీ అవుతున్నారు కేసీఆర్. జంతర్మంతర్ వద్ద ధర్నాను పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలోనే నిర్వహించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.