ఆ వార్తల్లో వాస్తవం లేదు: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Update: 2018-05-31 12:22 GMT

ప్రజాసేవ చేయాలన్న తపనతో అత్యున్నతమైన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి... ఏపీలో పల్లెబాట పట్టారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. అయితే, బీజేపీలో ఆయన చేరబోతున్నారని, 2019 ఎన్నికల్లో బీజేపీ ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అనే ప్రచారం ఓవైపు జరుగుతోంది. ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలో వాస్తవం లేదని, జిల్లాల పర్యటన పూర్తి చేసిన తరువాతే... రాజకీయ నిర్ణయం తీసుకుంటానని మాజీ ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ వెల్లడించారు. సమాజానికి తన వంతుగా సేవ చేయాలనే ప్రజల్లోకి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. చుక్కల భూముల సమస్య పరిష్కారం అయినట్టే... రాష్ట్రంలో ప్రతి సమస్య పరిష్కారం కావాలని లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. రైతలు సబ్సిడీలు, పథకాలు ఆశించడం లేదని, పంటలకి గిట్టుబాటు ధర ఇస్తే చాలంటున్నారని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

ఈ మధ్య ఆర్ఎస్ఎస్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొనడం కూడా ఈ చర్చకు మరింత బలాన్ని ఇస్తోంది. ఆయన సంఘ్ వ్యక్తి అని.. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీలో చేరతారని విశ్లేషణలు మొదలయ్యాయి. ఆయన మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఏపీలో జిల్లాల పర్యటనలో ఉన్నారు. రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. పార్టీ గురించి, పోటీ గురించి ఆయన స్వయంగా చెప్పకపోయినా వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేయాలని ఉందన్న విషయాన్ని ఆయన గతంలో చెప్పారు.

Similar News