జనసేనాని పవన్కల్యాణ్ కరువు యాత్రను అనంతపురం నుంచి శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనున్న పవన్ యాత్రపై అభిమానులు, కార్యకర్తలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీటన్నింటి మధ్య పవన్ టూర్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది.? తన ఉనికికి ఆయువు పట్టుగా ఉన్న ఉత్తరాంధ్ర నుంచో లేక సొంత జిల్లా నుంచో కాకుండా... అనంతపురం నుంచి ఎంచుకోవడం వెనుకున్న అసలు నిజమేంటి? గతంలో ఆదరించిన పార్టీల్లాగేనే అనంతవాసులు పవన్ను ఆదరిస్తారా? అక్కున చేర్చుకుంటారా?
ఇదీ కరీంనగర్ పర్యటనలో పవన్కల్యాణ్ మాట. జనసేన పార్టీ కార్యచరణ అనంతపురం నుంచే ప్రారంభం కానుంది. గతంలో అనంత సభలో ప్రకటించినట్లుగానే జిల్లాలో పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కరవుపై యాత్రకూ సిద్ధమైన పవన్- 7 నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు.
సినీ జీవితానికి స్వస్తి చెప్పి ఇక పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారిస్తానని కరీంనగర్ పర్యటనలోనే చెప్పిన మాటే ఇది. అయితే అనంత పర్యటనలో భాగంగా జిల్లాలో కరవు తీరాలంటే సుమారు 100 టీఎంసీల నీరు అవసరమని గతంలోనే చెప్పారు. కరవుపై భవిష్యత్తులో యాత్ర చేస్తాననీ ప్రకటించారు. అదే సమయంలో అక్కడి ఓ బహిరంగ సభలో 2019 ఎన్నికల్లో అనంతపురం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు పవన్కల్యాణ్.
పవన్ అనంతపురం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించడంపై ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ హిందూపురాన్నే తన రాజకీయ కేంద్రంగా ఎంచుకున్నారు. తన సొంత ఊరుతో పాటు తిరుపతిని కూడా కాదని అనంత నుంచే ఆయన శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తాజాగా జనసేనాధినేత పవన్కల్యాణ్ అనంతపురం నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టడంపై పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కరవుకు మారుపేరుగా ఉన్న అనంతపురం జిల్లాలో చంద్రబాబు 2103లో పాదయాత్ర చేపట్టారు. హిందూపురం నుంచే తన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వైఎస్ శర్మిలతో పాటు తాజాగా వైఎస్ జగన్ పాదయాత్రకు కూడా అనంతపురం జిల్లానే వేదికైంది. అంతకుముందు రాహుల్గాంధీ పుట్టపర్తి నియోకజవర్గంలోని ఓబుళదేవర చెరువు నుంచి పాదయాత్ర నిర్వహించారు. 1986లో వైఎస్ రాజశేఖర్రెడ్డి లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు చేపట్టిన యాత్రలో భాగంగా ఏడు రోజులు జిల్లాలో నడిచారు. ఇప్పుడు పవన్కల్యాణ్ కూడా అనంతనే ఎంచుకున్నారు. అయితే సమస్యలపై ఉద్యమిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న జనసేనాని అనంతలో వేళ్లూనుకున్న కరవు సమస్యలకు పరిష్కార మార్గం చూపుతాడని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఏమైనా పవన్ పాదయాత్రతో మాత్రం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారబోవడం ఖాయమంటున్నారు కార్యకర్తలు. జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అధికార, ప్రతిపక్షాల్లో ఓ రకమైన ఆందోళన ఉందంటున్నారు వారు. అనంత పర్యటనలో పవన్ నిర్ణయాలు ఎలా ఉండబోతాయో... తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటిస్తారా? పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగిస్తారా? అన్న ఉత్కంఠ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీకి 14 స్థానాల్లో 12 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన అనంతవాసులు పవన్కల్యాణ్ను ఏ విధంగాగా ఆదరిస్తారన్నిదే కాలమే తేల్చాలి.