కొనసాగుతున్న పవన్‌ ‘సేనానితో రైలు జర్నీ’

Update: 2018-11-02 10:04 GMT

ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ ఏ రైలుయాత్ర అయితే చేపట్టారో అదే యాత్రకు శ్రీకారం చుట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రరాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త రీతిలో ప్రజాపోరాట యాత్ర చేపట్టారు జనసేనాని. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి తుని వరకు ప్రజలతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1.20 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి మొదలైన ఈ యాత్ర సాయంత్రం 5.20 నిమిషాలకు ముగుస్తుంది. 

ఇప్పటి వరకు దేశంలో రైలు యాత్రలు చేపట్టిన పార్టీ అధినేతలలో పవన్ ఒకరు. మహాత్మగాంధీలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ రైలు యాత్రకు శ్రీకారం చుట్టారు. రైలులో ప్రయాణిస్తూ అసంఘటిత కార్మికులతోనూ ప్రయాణికులతోనూ పవన్ మమేకం అవుతున్నారు.  జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో 1.20 నిమిషాలకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ విజయవాడలో రైల్వే కార్మికులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా నూజివీడు రైల్వేస్టేషన్లో మామిడి రైతులతో సమావేశం నిర్వహించారు. మామిడి రైతులు ఎగుమతులపై ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కూడా ప్రజలతో మమేకమయ్యారు పవన్‌కల్యాణ్. తదనంతరం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, సామర్లకోటలలో పవన్ కళ్యాణ్ ప్రజలతో సమావేశమై వారి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీయనున్నారు. అలా సాయంత్రం 5.20 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ రైలు యాత్ర కొనసాగనుంది. ఆ తర్వాత తుని చేరుకుని తునిలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. 

రైలు యాత్ర సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేసింది. ప్రతి జనసేన కార్యకర్త ప్లాట్ ఫాం టిక్కెట్ కొనుగోలు చేసి రావాలని రైలులో ప్రయాణించే వారు టిక్కెట్ తీసుకోవాలని కోరారు. ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తనియ్యొద్దని  హితవు పలికారు. క్రమశిక్షణకు మారుపేరుగా జనసేనానిలు నడుచుకోవాలని పిలుపునిచ్చారు.  

Similar News