అధికార పార్టీ నుంచి, మీడియా నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత నిర్ణయించుకున్నారు. ప్రస్థుతం హైదరాబాద్ లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని పార్టీ సీనియర్ నేతలకు ఆదేశించారు. పాదయాత్ర పూర్తయ్యే నాటికి కార్యాలయ శాశ్వత నిర్మాణాలు పూర్తిచేయాలని జగన్ ఖచ్చితమైన ఆదేశాలిచ్చారు.
రాజధాని ప్రాంతం అమరావతికి పార్టీ కార్యాలయాన్ని తరలించేందుకు వైసీపీ పూర్తిస్థాయిలో సన్నద్ధమయింది . ప్రస్తుతం విజయవాడ బందర్ రోడ్డులో తాత్కాలిక కార్యాలయం అందుబాటులో ఉంది. పార్టీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయం నుండే కొనసాగుతున్నాయి. ఈ నేపద్యంలో ఇకపై పార్టీ కార్యకలాపాలను అమరావతి కేంద్రంగానే నిర్వహించాలని జగన్ బావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో త్వరగా పార్టీ కార్యాలయం ప్రారంభించి పార్టీ సమావేశాలు అక్కడే నిర్వహించడంతో పాటు, నేతలు, కార్యకర్తలు, అమరావతిలోనే అందుబాటులో ఉండాలని బావిస్తున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ పార్టీ కార్యాలయ భవనం నిర్మాణం వేగంగా జరుగుతోంది. అమరావతి రాజధానికి, సచివాలయం, అసెంబ్లీ కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్టీ కార్యాలయం, జగన్ ఇంటి నిర్మాణ పనులు పార్టీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. హైదరాబాద్ లోటస్ పాండ్ లో భవనాల మాదిరిగానే అమరావతిలోనూ నివాసం, పార్టీ కార్యాలయాలను పక్కపక్కన వచ్చే విధంగా డిజైన్ చేశారు. సువిశాలమైన ప్రదేశంలో ఈ నిర్మాణాలు జరగుతున్నాయి.
ప్రస్తుతం అదినేత జగన్ పాదయాత్రలో ఉన్నారు. ఇప్పటికే మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పాదయాత్ర నవంబర్ చివరి నాటికి పూర్తి కానుంది. పాదయాత్ర ముగిసేనాటికి అమరావతిలో పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు పూర్తి చెయ్యాలని పార్టీ ముఖ్యనేతలకు జగన్ ఆదేశించారు. .
రాష్ట్ర విభజన జరిగిన నాలుగేళ్ళ తరువాత అమరావతిలో నివాసం ఉండేందుకు జగన్ సిద్దమయ్యారు. డిసెంబర్ నెలలో పార్టీ కార్యాయలన్ని ప్రారంబించాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం తేదీలను పరిశీలిస్తున్నారు. డిసెంబర్ 7 తేదిన కాని జగన్ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 21 తేది కాని వాటిని ప్రారంభించాలని పనులు వేగం పెంచారు.