తిరుపతి జనసేనలో వర్గవిభేదాలు రచ్చకెక్కుతున్నాయి. భౌతిక దాడులకు సైతం సేన కార్యకర్తలు తెగబడుతున్నట్టు బుధవారం అలిపిరి పోలీసులకు అందిన ఫిర్యాదు వెల్లడిస్తోంది. చిత్తూరు జిల్లా పవన్ కల్యాణ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు పసుపులేటి సురేష్పై అదేపార్టీకి చెందిన కిరణ్ రాయల్ మరికొందరు బుధవారం సాయంత్రం దాడిచేసినట్టు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు అందింది. దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ బాధితుడు సురేష్ పోలీసులను కోరారు. ఫిర్యాదు అనంతరం ఆ పార్టీనాయకుడు సురేష్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీలోనే మరో వర్గం నాయకులు గురువారెడ్డి సమాధుల వద్ద తనపై దాడి చేశారన్నారు. గతంలో నేరచరిత్ర ఉండి ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న వారి వల్ల జనసేన పార్టీ స్థాయి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.