ఉగ్రరూపం దాల్చిన గోదారి

Update: 2018-08-18 06:10 GMT

తెలుగు రాష్ట్రాల్లో జోరు వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉప నదులు కూడా పొంగి ప్రవహిస్తూ ఉండటంతో  గోదావరి పరివాహక ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలోను ముంచెత్తిన గోదారి  ఏపీలోనూ మహోగ్రరూపం దాల్చింది.  దీంతో ముందస్తుగా అప్రమత్తమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

గోదావరి వరద బీభత్సంతో తూర్పు గోదావరి జిల్లాలో 20 గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల ప్రజలను సమీపంలోని సహాయక కేంద్రాలకు తరలించిన అధికారులు పునరావాస చర్యలు చేపట్టారు.  వరద ప్రవాహం పెరిగే అవకాశాలున్నాయంటూ హెచ్చరికలు రావడంతో  ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేశారు.  రాజమండ్రిలో వరద పరిస్ధితిని కలెక్టర్ కార్తికేయ మిశ్రా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలోనూ గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఏజెన్సీ పరిధిలోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.  పోలవరం  ప్రాజెక్టు పరిధిలోకి వరద నీరు రావడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. స్విల్ ఛానల్‌తో పాటు కాంక్రీట్ పనులకు ఆటంకం ఏర్పడింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ఎర్త్ వర్క్‌కు ఆటంకం ఏర్పడింది. 

Similar News