తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన తీవ్ర వివాదం రేపుతోంది. ఏకపక్షంగా నేతలకు టికెట్లు ఖరారు చేయడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓడిపోయే వారికి టికెట్లు ఇవ్వకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. పార్టీ నేతలకు పీసీసీ ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయ్. హైకమాండ్ ఆదేశాలతో టికెట్లు ఇవ్వాలని గెలవలేని అభ్యర్థులకు టికెట్లు ఎలా ఇస్తారని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయ్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మాల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సర్పంచ్ ఇటీవల కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పార్టీ అధ్యక్షుడు క్యామ మల్లెశ్ను గెలిపించాలంటూ పీసీసీ ప్రకటించింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో టికెట్ల దుమారం రేగింది.
గత ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసిన క్యామ మల్లేశ్ మూడో స్థానంలో నిలవగా రెబల్గా పోటీ చేసిన మల్రెడ్డి రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచారని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయ్. క్యామ మల్లేశ్కు టికెట్ ఖరారు చేయడంపై మల్రెడ్డి రంగారెడ్డి అనుచరులతో కలిసి గాంధీభవన్లో నిరసన వ్యక్తం చేశారు. టీపీసీసీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం మానుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సీనియర్ నేతలంటున్నారు. లేని పక్షంలో టీపీసీసీపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.