Adilabad: ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం: యోగాసనాలు వేసి స్ఫూర్తినింపిన కలెక్టర్ రాజర్షి షా
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా 'హెల్త్ వీక్' వేడుకల్లో భాగంగా యోగా శిబిరంలో పాల్గొన్నారు.
Adilabad: ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం: యోగాసనాలు వేసి స్ఫూర్తినింపిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మారుతున్న జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు, శారీరక, మానసిక సమతుల్యత సాధించేందుకు యోగా అత్యుత్తమ సాధనమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’, ‘తెలంగాణ రైజింగ్ 2047’ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం, ఆయుష్ డే సందర్భంగా ‘హెల్త్ వీక్’ వేడుకలలో యోగా శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పాల్గొని ప్రజలు, అధికారులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యం కోసం కలిసికట్టుగా విజ్ఞానంతో ముందుకు అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో కనీసం అరగంట సమయం యోగా లేదా వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.
జిల్లాను ఆరోగ్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. యోగా ద్వారా శరీర దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా సాధించవచ్చని తెలిపారు.