ఏపీ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో చేరనున్నారు. గత కొన్ని రోజుల నుంచి వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్న ఆయన... వచ్చే వారం ప్రజాసంకల్ప యాత్రలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. 1999 ఎన్నికల్లో నందిగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గుచూపారు. గుంటూరు-2 స్థానం నుంచి కృష్ణప్రసాద్ను రంగంలోకి దించాలని టీడీపీ యోచించింది.
రాజకీయ సమీకరణాలతో చివరి నిమిషంలో టికెట్ లభించలేదు. ఆ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ‘తంగిరాల’ గెలుపునకు కృషి చేశారు. తంగిరాల ప్రభాకరరావు మరణించిన తర్వాత ఉప ఎన్నికల నుంచి ఆయన్ను దూరంగా ఉంచారు. పార్టీ పరంగా ఎలాంటి ప్రాధాన్యమివ్వలేదు. తర్వాత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకటి, రెండు సందర్భాల్లో కృష్ణప్రసాద్ను జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.