అతనో బాధ్యతగల వైద్యుడు. అందులో ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అక్కడ ప్రాణాలతో పోరాడుతున్న పేషెంట్లను చూడాల్సింది పోయి మద్యం మత్తులో తూగుతున్నాడు. ఇదేంటని ప్రశ్నించినవారిపై బూతుల దండకాన్ని అందుకుంటున్నాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో జరిగిన ఈ ఘటన హాట్టాపిక్గా మారింది.
పరిగి ప్రభుత్వాస్పత్రిలో నైట్ డ్యూటీ నిర్వహిస్తున్న డాక్టర్ ప్రవీణ్... రౌండ్లకు వెళ్లకుండా... తన రూంలో కూర్చోని పెగ్గుల మీద పెగ్గులు లాగించేశాడు. బిర్యానీ, బీర్ని పక్కన పెట్టుకుని నైట్ అంతా పెషెంట్లను పట్టించుకోవడం మానేశాడు. కరెక్టుగా మత్తులో జోగుతున్న సమయంలోనే పూడూర్ మండలం సోమన్ గుర్తి గ్రామానికి చెందిన శంకర్ తేలు కరిచిందని ఫ్రెండ్తో కలిసి ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్కు ట్రీట్మెంట్ చేయమని అడిగితే కనీసం పల్స్కూడా పట్టుకోకుండా హైదరాబాద్కు వెళ్లాలని రిఫర్ చేశాడు. దీంతో ఖంగుతిన్న పెషెంట్ ఇదేంటని ప్రశ్నిస్తే నీకెందుకు అంటూ మండిపడుతూ స్టుపిడ్ అంటూ తిట్లు అందుకున్నాడు. అంతటితో ఆగకుండా ఇక్కడి నుంచి వెళ్తారా లేక తరమి కొట్టాలా అంటూ బూతులు అందుకున్నాడు.
డ్యూటీలో ఉన్న డాక్టర్ వేస్తున్న చిందుల గురించి పోలీసులకు సమాచారం అందజేసినా ఖాకీలు రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఎమర్జెన్సీ కేసులు వస్తే మద్యం మత్తులో ఉన్న మీరు ఎలా వైద్యం చేస్తారని ప్రశ్నిస్తే మీ ఇష్టం వచ్చింది చేసుకోమని డోర్ వేసుకున్నాడు డాక్టర్ ప్రవీణ్. బాధ్యతగల వైద్య వృత్తిలో ఉండి ఇలా మందు కొట్టి ఆస్పత్రికి రావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.