అధికారమే లక్ష్యంగా పోరాడుతున్న టీ కాంగ్రెస్కు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి, మేనిఫేస్టో కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలను కనుచూపుతో శాసించిన చరిత్ర దామోదర రాజనర్సింహ కుటుంబానిది.
తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న దామోదర రాజనర్సింహ కుటుంబంలో కమలం వికసించింది. ఉమ్మడి ఏపీలో డిప్యూటి సీఎంగా, తాజాగా ఎన్నికల మేనిఫేస్టో కమిటీ ఛైర్మన్గా ఉన్న రాజనర్సింహ భార్య బీజేపీలో చేరడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ రూపొందించిన ఇంటికో టికెట్ నిబంధనపై అసహనంతో పార్టీని వీడినట్టు సమాచారం. సంగారెడ్డి టికెట్ కోసం గత కొద్ది కాలంగా పట్టుబడుతున్న ఆమె ఇందుకోసం పలు సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే తాజా పరిణామాల నేపధ్యంలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ పద్మిని రెడ్డి పేరును పరిగణలోకి తీసుకోకపోవడంతో పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు.
తనతో పాటు బీజేపీలోకి రావాలంటూ భర్త దామోదర రాజనర్సింహను కోరినట్టు సమాచారం. అయితే సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్లో ఉంటున్న తాను మనసు చంపుకుని పార్టీ మారలేనంటూ చెప్పినట్టు సమాచారం. దీంతో ఒంటరిగానే బీజేపీలో చేరారు. ప్రస్తుతానికి సంగారెడ్డి నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. అయితే తాజా పరిణామాలపై దామోదర రాజనర్సింహ తీవ్ర ఆవేదనతో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మేనిఫేస్టో కమిటీ ఛైర్మన్గా ఉన్న తన సతీమణే బీజేపీలో చేరడం ఆయనకు మింగుడు పడటం లేదు. కొందరు నేతలు కావాలనే తనపై కుట్రలు చేస్తూ కుటుంబంలో విభేదాలు పెట్టారంటూ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు.