తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. తుది జాబితా ఖరారుపై స్క్రీనింగ్ కమిటీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఢిల్లీలో దాదాపు 14 గంటలపాటు సుదీర్ఘ భేటీ నిర్వహించినా ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. నియోజకవర్గాల వారీగా సమర్ధులైన నాయకుల కోసం ఆరా తీస్తోంది. ఇప్పటికే 54 మందిని ఖరారు చేసిన ఎన్నికల కమిటీ మిగిలిన అభ్యర్థుల జాబితా కూర్పుపై కసరత్తులు చేస్తోంది.
తెలంగాణలో అధికార పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు అధిష్టానం కనుసన్నల్లో ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 54 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం కూడా పొందింది. ఇక మిత్రపక్షాల కోసం పక్కనపెట్టిన 24 స్థానాలను తీసేయగా మిగిలిన 38 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ మంగళవారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్లో సుదీర్ఘంగా కసరత్తు జరిపింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం అర్ధరాత్రి వరకూ దాదాపు 14గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది.
రాహుల్ ఆంతరంగికుడు కొప్పుల రాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్దాస్, సభ్యులు షర్మిష్ట ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, రేవంత్రెడ్డి, తెలంగాణ ఇన్చార్జి ఏఐసీసీ కార్యదర్శులు సలీం అహ్మద్, బోసురాజు, శ్రీనివాసన్ తదితరులు ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. తొలుత ఎస్టీ, ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు, తదుపరి జనరల్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేశారు.
ఇక టీడీపీకి 14, టీజేఎస్కి 7 నుంచి 8 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు ప్రచారం జరుగుతున్నా, అవి పోటీ చేసే స్థానాలు నిర్ధిష్టంగా తేలలేదు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా అంగీకారానికి వచ్చిన సీట్లను వదిలేసి మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థుల ఎంపికపై చర్చించింది స్క్రీనింగ్ కమిటీ. మెజారిటీ స్థానాల్లో ఒకే పేరును ప్రతి పాదించినప్పటికీ పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో రెండేసి పేర్లను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
అంతిమంగా సామాజిక సమీకరణాలకు అనుగుణంగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించి వీటిలో అసలు అభ్యర్థిని ఎంపిక చేయనుంది. ఆశావహుల మధ్య అత్యంత పోటీ ఉండి, ఆయా స్థానాలు మిత్రపక్షాలు అడుగుతున్న పరిస్థితి ఉంటే వాటిని మిత్రపక్షాలకే వదిలేసేందుకు స్క్రీనింగ్ కమిటీ మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. తాజా ప్రతిపాదనలను స్క్రీనింగ్ కమిటీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందజేయనుంది. ఎన్నికల కమిటీ ఈ నెల 8న సమావేశమై అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసి పార్టీ అధ్యక్షుడి ఆమోదం కోసం పంపనుంది. దీంతో ఈ నెల 9న అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.