టాలీవుడ్ కమేడియన్ విజయసాయి భార్య అజ్ఞాత వాసం వీడింది. ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగి పోయింది. తానే పాపం ఎరగనంటూ మీడియా ముందు తన వాదన వినిపించింది. అవే సాక్ష్యాలు పోలీసులకు కూడా ఇస్తున్నట్లు చెప్పింది. ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించిన పోలీసులు వనితను అరెస్ట్ చేయలేదు. మూడు రోజుల తరువాత విచారణకు రమ్మని ఆదేశించారు. కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కమెడియన్ విజయ్ సాయి భార్య వనితారెడ్డి.. నిన్న జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సరెండర్ కావాలంటూ.. పోలీసులు ఇచ్చిన నోటీసులతో.. ఆమె లాయర్ తో వచ్చి లొంగిపోయారు. విజయ్ సెల్ఫీ వీడియోలో చేసిన ఆరోపణలపై.. పోలీసులు వనితారెడ్డిని విచారించారు.
తన కూతురు భవిష్యత్ కోసమే.. ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్నానని చెప్తోంది వనితారెడ్డి. తానెక్కడికీ పారిపోలేదని.. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని నిరూపించడానికే.. ఇన్నాళ్లూ బయటకు రాలేదని తెలిపింది. సాక్ష్యాలు సేకరించడానికి ఆలస్యమైందన్నారు. విజయ్ ను తాను వేధించలేదని సెల్ఫీ వీడియోలో తన పేరు ఎందుకు చెప్పాడో తెలియడం లేదని చెప్తోంది వనితారెడ్డి. విజయ్ సొంత తల్లిదండ్రుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తోంది వనితారెడ్డి. విజయ్ ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. మూడేళ్లుగా విజయ్ కి దూరంగా ఉంటున్నానని తెలిపింది. విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. తాను సేకరించిన ఆధారాలను పోలీసులకు సమర్పిస్తున్నట్లు చెప్పింది వనితారెడ్డి. శశిధర్రెడ్డి ఎవరో తనకు తెలీదన్నారు.
పోలీసులకు లొంగిపోవడానికి వచ్చిన వనితారెడ్డి ఈ గ్యాప్లో తన వాదనంతా మీడియా ముందు వినిపించింది. తరువాత తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను పోలీసులకు సమర్పించింది. వనతి ఇచ్చిన సమచారాన్ని, సాక్ష్యాలను తీసుకున్న పోలీసులు మూడు రోజుల తరువాత రావాలని చెప్పి పంపారు.