నాలుగు రోజుల ముందే పిఠాపురం ప్రజాప్రతినిధులకు సంక్రాంతి వచ్చేసింది. ఒక పక్క హైకోర్టు ఆదేశాలు మరోపక్క పోలీసులు పహారాను సైతం బేఖాతరు చేస్తున్నారు ప్రజాప్రతినిధులు. సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాన్నే వేదికగా చేసుకుని కోడిపందేలు ఆడించి తమ పంతం నెగ్గించుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో కోళ్లు కాలు దువ్వాయి. జన్మభూమి ముగింపు సందర్భంగా స్థానిక రాజీవ్ గాంథీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో సాక్షాత్తు ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, కాకినాడ ఎంపీ తోట నరసింహులు రంజుగా కోడి పందాలను ఆడించారు. తెలుగు తమ్ముళ్ల చప్పట్లు, ఈలలు, కేరింతల మధ్య కోళ్ల కొట్లాట రసవత్తరంగా సాగింది. పోలీసులు సమక్షంలోనే ఈ తతంగమంతా జరగడం గమనార్హం.