దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై సీఎం చంద్రబాబు మరోసారి సీరియస్ అయ్యారు. విజయవాడ హనుమాన్ జంక్షన్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పట్ల చింతమనేని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ప్రవర్తన వల్ల ప్రజల్లో పార్టీకి చెడ్డపేరు వస్తుందని మండిపడ్డారు. ఇవాళ తనను కలిసి ఘటనపై వివరణ ఇవ్వాలని చింతమనేని ఆదేశించారు.
ఆర్టీసీ బస్సుపై ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనలో సీఎం ఫొటో చిరిగి ఉండటాన్ని గమనించిన చింతమనేని... ఆ బస్సుని అక్కడే నిలిపివేసి, డ్రైవర్, కండక్టర్లను దుర్భాషలాడారు. బస్సులో ప్రయాణికుల్ని దించేసి వేరే బస్సులోకి ఎక్కించాలని ఆదేశించారు. గరికపాటి నాగేశ్వరరావు అనే స్థానికుడు ప్రశ్నించే ప్రయత్నం చేయగా, ఆయనపై చేయి చేసుకున్నారు. మంగళవారం జరిగిన ఈ సంఘటన సందర్భంగా.. చింతమనేని ప్రవర్తించిన తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.