మహారాష్ట్ర ధర్మాబాద్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బాబ్లీ వ్యతిరేక పోరాట కేసులో ఏపీ సీఎం చంద్రబాబుతో సహా 16మందికి ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్బెయిలబుల్ వారెంట్పై ఈరోజు విచారణ జరగనుంది. దాంతో ఈ కేసుపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు వారెంట్పై చంద్రబాబు రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో న్యాయస్థానం ఎలా స్పందింస్తుందోనన్న టెన్షన్ నెలకొంది.
ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్బెయిలబుల్ వారెంట్ కేసు ఈరోజు విచారణకు రానుంది. అయితే చంద్రబాబు కోర్టుకు హాజరుకాకుండా రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు అమెరికా వెళ్తున్నందున తన తరపున న్యాయవాదులను పంపుతున్నారు. చంద్రబాబుతోపాటు వారెంట్లు అందుకున్న టీడీపీ నేతల తరపున కూడా రీకాల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రముఖ న్యాయవాది సుబ్బారావును పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాబ్లీ కేసులో వాయిదాలు, నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినా నోటీసులు అందలేదనే విషయాన్ని న్యాయవాదులు కోర్టుకు విన్నవించనున్నారు. అలాగే ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్, నాన్బెయిలబుల్ వారెంట్ కాపీలను అధికారికంగా తీసుకోనున్నారు.
తాజా మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ప్రకాష్గౌడ్లు కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉండగా, జుక్కల్ తాజా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాత్రం తనకు నోటీసులు అందలేదని చెబుతున్నారు నోటీసులు అందకపోతే కోర్టుకు ఎలా హాజరవుతారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబుకి సైతం నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిన ఈ కేసులో మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనన్న ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.