నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో దళితులపై దాడిచేసిన బీజేపీ నేత భరత్ రెడ్డిని నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు నెలరోజులుగా పరారీలో ఉన్న భరత్రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు... విచారణ నిమిత్తం నిజామాబాద్ తరలించారు.
అక్రమంగా చెరువు నుంచి మొరం తరలింపును అడ్డుకోవడంతో దళిత యువకులు లక్ష్మణ్, రాజేశ్వర్పై భరత్ రెడ్డి దాడి చేశాడు. దళితులపై భరత్రెడ్డి దౌర్జన్యం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చేత కర్రపట్టుకుని బడిపిల్లలను బాదినట్లు బాదడంతో పాటు రెండు చేతులు కట్టుకోవాలని, తప్పుచేశామని ఒప్పుకోవాలని భరత్ రెడ్డి రాయలేని భాషల్లో బూతులు తిడుతూ దాడి చేశాడు. అంతేకాదు దాడి దృశ్యాలు వైరల్ కావడంతో బాధితులను కిడ్నాప్చేసి హైదరాబాద్లో బంధించాడు. అయితే వాళ్లిద్దరూ తప్పించుకుని ఇంటికి చేరడంలో కథ అనేక మలుపులు తిరిగింది.
భరత్రెడ్డి ఆగడాలపై కన్నెర్ర చేసిన దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దాంతో వారం క్రితం లక్ష్మణ్, రాజేశ్వర్ హైదరాబాద్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. అయితే ఇదంతా దొరల రాజ్యం సినిమా షూటింగ్లో భాగమని లక్ష్మణ్, రాజేశ్వర్ చెప్పడంతో అంతా నిజమనుకున్నారు. అయితే లక్ష్మణ్, రాజేశ్వర్ అభంగపట్నం చేరుకున్నాక తమను భరత్ రెడ్డి కిడ్నాప్ చేశాడని, ప్రాణాలు కాపాడుకునేందుకే అలా సినిమా షూటింగ్ అని చెప్పామన్నారు. భరత్ రెడ్డిపై ఎస్సిఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్ కేసు కూడా నమోదు చేశారు. అయితే భరత్రెడ్డి అరెస్ట్పై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.