సృష్టిలో ఏ జీవికైనా తల్లి తల్లే తల్లి పట్ల పిల్లలకు, పిల్లల పట్ల తల్లికి అమితమైన ప్రేమానురాగాలు ఉంటాయి. కేవలం మనుషులే కాదు..., పక్షులు, జంతువుల మధ్య అంతులేని ఆప్యాయత, అనురాగం ఉంటాయి. అలాంటి అనురాగమే పెంచుకున్న వానరం పిల్ల తన తల్లి చనిపోతే ఏడ్చేసింది. నువ్వు లేక పోతే ఇక నేను ఎలా జీవించేది అన్న విషయాన్ని తలపించేలా ఆ వానరం పిల్ల కన్నీరుపెట్టుకున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది.
ప్రేమ, ఆప్యాయత, అనుబంధం.. మనుషుల్లోనే కాదు.. తమలోనూ ఉంటాయని నిరూపించిందో పిల్ల వానరం. తల్లికి ఏమైందో తెలియని పిల్లవానరం తల్లిని లేపడానికి ప్రయత్నించింది. తల్లి ఛాతీపై చెవి ఉంచి గుండె కొట్టుకుంటున్నదో లేదో గమనించింది. ఎంత ప్రయత్నించినా తల్లి లేవకపోవడంతో తీవ్రంగా ఏడ్చింది. చివరకు తల్లి చనిపోయిందని తెలుసుకున్న పిల్ల కోతి తల్లిని పట్టుకుని విలపించిన తీరు కంటతడి పెట్టించింది.
తల్లికోతి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మరణించింది. జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తురిపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అచేతనంగా పడి ఉన్న తల్లి వద్దకు చేరుకున్న పిల్ల కోతి తల్లిని పట్టుకుని కదిలించింది. తల్లి మృతదేహం చుట్టు కోతి పిల్ల తిరగడం ,హత్తుకోవడం, గట్టిగా పట్టుకోవడం, అటు ఇటు ఊపడం, ముఖం వద్ద కూర్చుని లేపే ప్రయత్నం చేసిన ఘటన చూసిన వారి కళ్ల వెంట వారికి తెలియకుండానే నీళ్లు వచ్చాయి.
సృష్టిలో అతి మధురమైనది అమ్మ అంటూ కోతిపిల్ల తన తల్లి మృతదేహాన్ని రోడ్డు పక్కకు జరిపినా దానినే పట్టుకుని విడవకపోవడం తల్లి, బిడ్డల బంధం గొప్పదనానికి నిదర్శనం. ప్రేమించిన వారిని కోల్పోతే అనుభవించే బాధ అంతా ఇంతా కాదు. అది మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా ఒకటేనని ఈ విదారక ఘటన చూస్తే అర్ధమవుతోంది. పేగు బంధం కోసం తల్లడిల్లుతున్న కోతులను చూసైనా తల్లిదండ్రులను పురుగుల్లాగా చూసే బిడ్డలకు కనువిప్పు కలగాలని ఆశిద్దాం.