రూ.2 వేల నోట్లను రద్దు చేయాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. దేశంలో రూ.500కు మించి పెద్ద నోటు ఉండకూడదన్నది తమ విధానమని, రూ.2 వేల నోటు వల్ల దేశంలో అవినీతి మరింత పెరిగే అవకాశం ఉందని నారా లోకేశ్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయంలో ఐసీఐసీఐ బ్యాంకు శాఖను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దు కోసం 2012 నుంచి సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని చెప్పారు. గతంలో తాను నగదు బదిలీ పథకం అంటే అందరూ నవ్వారని, ఇప్పుడు అదే దేశానికి మార్గదర్శకం కాబోతుందన్నారు. బ్యాంకు శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐసీఐసీఐ ఏపీ, తెలంగాణ జోనల్ హెడ్ ప్రశాంత్ బిందాల్, విజయవాడ రీజినల్ హెడ్ పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సచివాలయంలో ఇప్పటికే ఎస్బీఐ, ఆంధ్రా, కెనరా బ్యాంకు శాఖలున్నాయి.