వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ఆగస్టు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ పథకంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పలుమార్లు సమీక్ష నిర్వహించారు. వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారందరికీ ఉచితంగా ఈ పథకం ద్వారా వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే.
పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని సిఎం వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. అందుకుగాను నెట్వర్క్ ఆస్పత్రులకు పెండింగ్లో ఉన్న దాదాపు రూ.450 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు.,ఇటీవల కలెక్టర్ల సదస్సు అనంతరం వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే అమలు చేయాల్సిన అంశాలపై అధికారులకు సిఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఎబిహెచ్) గుర్తింపు పొందేలా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో తగిన మౌలిక వసతులు, మానవ వనరులు ఏర్పాటు చేయాలని, ఆ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య సంస్థలు, ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు.