Palnadu Accident: పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మహిళలు దుర్మరణం
Palnadu Accident: పల్నాడు జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం మాదల మేజర్ కాలువ కట్టపై కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు మరనించారు. మరోముగ్గురు గాయపడ్డారు. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళలు మిరప పంట కోతలకు వెళ్లి తిరిగి తమ స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ట్రాక్టర్ ప్రమాదంలో మధిర గంగమ్మ, మధిర సామ్రాజ్యం, చక్కెర మాధవి, తేనెపల్లి పద్మావతి అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రమాదస్థలిని పరిశీలించారు. ట్రాక్టర్ ప్రమాదంపై మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి విచారాన్ని వ్యక్తం చేశారు. మహిళా కూలీల మ్రుతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్రాక్టర్ ప్రమాదం గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలందించాలని అధికారులను ఆదేశించారు.
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మహిళలు మరణించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు.