పుట్టుకతోనే అంధత్వం.. అయినా ఐఏఎస్‌లో ర్యాంకు

Update: 2019-08-18 13:00 GMT

అతని సంకల్పం ముందు అంధత్వం ఓడింది. పేదరికం తలవంచింది సత్యం. కృషి, పట్టుదల, ఏదైనా సాధించాలనే తపన, సంకల్పం ఉంటే చాలు అని నిరూపించాడు. పుట్టుకతోనే అంధుడు అయినా, అనుకున్నది ఎందుకు సాధించలేననే దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. విజయం సాధించాడు. తూర్పు గోదావరి జిల్లామలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన కట్టా సింహాచలం 2018 ఐఏఎస్‌ బ్యాచ్‌లో 457వ ర్యాంకు సాధించి ట్రై నీ కలెక్టర్‌గా ముస్సోరీలో శిక్షణకు ఎంపికయ్యారు.

సింహాచలం తల్లిదండ్రులు కట్టా వాలి, వెంకట నర్సమ్మలు వీరికి ఐదుగురు సంతానం వీరిలో నాలుగో సంతానమైన సింహాచలం పుట్టకతోనే అంధుడు తండ్రి వాలి పాత గోని సంచుల వ్యాపారం చేశేవాడు. తండ్రికి కుమారుడిని చదివించే స్తోమత లేదు. ఆ పేదరికంతోనే సింహాచలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని బ్రెయిలీ స్కూల్‌లో చదువుతూ మలికిపురం ఎంవీఎన్‌ జేఎస్‌ అండ్‌ ఆర్వీఆర్‌ డిగ్రీ కళాశాలలో దాతల సహకారంతో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో కుటుంబానికి తాను భారం కాకూడదనుకున్న అతను ఐఏఎస్ కావాలని సంకల్పించుకున్నాడు ఆ క్రమంలోనే బీఈడీ కూడా చదివి తిరుపతి కేంద్రీయ విద్యాలయంలో టీచరు ఉద్యోగం లో చేరారు.

2014 సంవత్సరంలో సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాశారు. 1212 ర్యాంకు సాధించారు. కలెక్టర్‌ అయ్యే అవకాశం కొద్దిలో మిస్‌ అయింది. అయినా నిరాశ చెందలేదు. 2016లో ఐఆర్‌ఎస్‌లో రాణించి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా ఢిల్లీ, హైదరాబాద్‌లలో పని చేస్తూనే తన ఆశయం అయిన ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అయ్యారు. ఎట్టకేలకు 2019 ఐఏఎస్‌ ఫలితాల్లో ర్యాంకు సాధించారు. ప్రసుతం సింహాచలం ముస్సోరిలో ట్రై నీ కలెక్టర్‌గా శిక్షణ తీసుకుంటున్నారు. ఎవరిపై వారికి నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందని అవయవ లోపం అన్నది అడ్డంకి కాదని సింహాచలం చెబుతున్నారు. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే ప్రతి ఒక్కరూ అవయవ దానాన్ని ప్రోత్సహించాలన్నారు.  

Full View

Tags:    

Similar News