అమరావతి రాజధాని రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిలకలూరిపేట పోలీసుల ముందు హాజరుకావాలని నోటీసులు అందించారు. సెక్షన్ 307, 324, 427, రెడ్విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద రైతులకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్కు ఆధార్ కార్డుతో రావాలని 15 మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు అందాయి.
ఈ నోటీసులపై రైతులు స్పందిస్తూ ఉద్యమం అణిచివేతకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. అమరావతిలో తాము నిరసనలు చేస్తుంటే తుళ్లూరు పరిధిలో కాకుండా సంబంధం లేకుండా ఇలా చిలకలూరిపేట, తెనాలి, గుంటూరు పోలీస్ స్టేషన్లలో కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారో అర్ధం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో తాము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నామని ఇలా పోలీసులు నోటీసులు పంపించడం ఆశ్చర్యంగా ఉందని రైతులు చెబుతున్నారు.