Visakhapatnam: పండుగ ప్రభావం ప్రయాణీకులకు నరకం
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విశాఖ రైల్వే స్టేషన్ కిక్కిరిసి పోతోంది.
విశాఖపట్నం: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విశాఖ రైల్వే స్టేషన్ కిక్కిరిసి పోతోంది. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ, బెంగళూర్, చెన్నై ప్రాంతాల నుంచి వస్తున్న పలు రైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, పలాస, గుణుపూర్ వెళ్లే పలు రైళ్ల కోసం వేలాది మంది ప్రయాణికులు తరలిరావడంతో విశాఖ రైలేస్టేషన్ ఆదివారం కిటకిటలాడింది. పలు దూర ప్రాంత రైళ్లలో రద్దీ క్రమంగా పెరిగింది.
సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్లో కాలు మోపేందుకు అవకాశం లేనంతగా జనాలు కిక్కిరిశారు. దాదాపు 20కు పైగా ప్రత్యేక రైళ్లు విశాఖకు రాకుండా దువ్వాడ మీదుగా వెళ్లడంతో నిత్య రైళ్లపై ఎక్కువ ప్రభావం పడింది. దాదాపు మూడు నెలల ముందు రిజర్వేషన్లు అయిపోవడంతో సాధారణ బోగీలపైనే ప్రయాణికులు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కడికక్కడ తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి.