తన రూటే సపరేట్ అపరిచితులా మరి పరేషాన్ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీలో డబుల్ సిమ్కార్డ్లా ప్రవర్తిస్తున్నాడు. పైగా తనకు లెక్కలేనంత తిక్క ఉందని కానీ దానికి ఓ లెక్క ఉందని వాదిస్తున్నాడు. మంచైనా చెడైనా ఎలాగైనా ఫేమస్ కావాలని ఆశపడుతున్నాడు. మూడు ముక్కలే ప్రపంచంగా పెరిగిన కుర్రాడు అందరిని ఆగమాగం చేస్తున్నాడు. ఆ కుర్రాడి మాటలకు బుర్రగిర్రున తిరిగిన అధికారులు ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఇంతకీ ఆ కుర్రాడు చెప్పిన సీక్రెట్ ఏంటో తెలియాలంటే అర్జెంట్గా ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
చిత్తూరు జిల్లాలో ఓ యువకుడు తన మాటాలతో జనానికి పిచ్చెక్కిస్తున్నాడు. మూడు ముక్కలాటలో ఫేమస్ అయిన పాతికేళ్ల కుర్రాడు ఆ పని మానేసి మంచిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఆరో తరగతి వరకే చదివిన ఆ కుర్రాడు ఇప్పుడు సడెన్గా బుద్దిమంతుడిగా మారాలని నిర్ణయించుకోవడం హాట్టాపిక్గా మారింది.
చిత్తూరు జిల్లా మదనపల్లె బసినికొండకు చెందిన బావాజీ అనే యువకుడు అధికారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ప్లెయింగ్ కార్డ్స్కు అలవాటు పడ్డ కుర్రాడు ఏమైందో ఏమో తెలియదు కానీ సడెన్గా చచ్చిపోవాలనుకున్నాడు. కంటిచూపుతోనే కార్డు ఏదో గుర్తుపట్టగల జీనియస్ దాదాపు రెండు కోట్లవరకు సంపాదించి వాటిని పోగొట్టుకున్నాడట. తన ఆటపై ఉన్న నమ్మకంతో పలువురు జోరుగా బెట్టింగులు కూడా కాసేవారట. దానితో సాటిస్ఫై కానీ యువకుడు స్పందన కార్యక్రమంలో హల్చల్ చేశాడు.
సమస్యలపై వినతులు తీసుకుంటున్న స్పందన కార్యక్రమంలో ఉన్న అధికారులకు వింత అర్జీ పెట్టుకున్నాడు బావాజీ. జూదంలో అరితెరిన తాను ఆ ఆటకు గుడ్బై చెప్పాలనుకుంటున్నానని మోసం చేసి సంపాదించే సంపాదన తనకు వద్దంటూ రియలైజ్ అయ్యాడు. ఒకరిని చీట్ చేయడం నచ్చడం లేదని పైగా తన గురించి పది మంది మాట్లాడుకోవాలని ఏదో ఒకటి చేసి షార్ట్టైంలో ఫేమస్ కావాలని కోరిక కలిగిందన్నాడు. వెంటనే స్పందన కార్యక్రమానికి వెళ్లి సబ్కలెక్టర్ ముందు తన కోరికను అధికారుల ముందు ఉంచాడు. అంతేకాక తన అవయవాలన్నీ దానం చేసేసి పరలోకానికి పోతానని అర్జి పెట్టుకోవడంతో అధికారులు సైతం ఖంగుతిన్నారు.
బావాజీ మాటలకు నవ్వాలో ఏడ్వాలో తెలియని సబ్కలెక్టర్ కీర్తి మంచిగా చదువుకో అని సలహా ఇచ్చారు. అయితే ఇప్పుడు చదువుకునే మూడ్, ఉత్సాహాం తనకు లేదని అందుకే అవయదానం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాధానం చెప్పాడు. తిండి, నిద్ర తప్ప మరో ప్రపంచం తెలియదంటున్న బావాజీ జీవితంపై కూడా పెద్ద పెద్ద కోరికలు లేవని లగ్జరీ లైఫ్ కూడా తనకు అవసరం లేదని కానీ తన గురించి అందరూ మాట్లాడుకోవడమే ముఖ్యమంటోన్నాడు. యువకుడి మాటలకు పరేషాన్ అయినా అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.