తుంగభద్ర డ్యామ్కు వరద ప్రవాహం పోటెత్తింది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణా ఉప నది అయిన తుంగభద్ర నిండుకుండలా మారింది. దీంతో డ్యాంకు చెందిన 32 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్రకు ఇన్ ఫ్లో లక్షా 55 వేల 431 క్యూసెక్కులు కాగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉండటంతో ఐదో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. హస్పేట బళ్లారితో పాటు కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.