శ్రీకాకుళం జిల్లాలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. గొడవకు దారితీసిన వైసీపీ, బీజేపీ ఫ్లెక్సీలు
ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హీట్ చల్లారలేదు. పలు నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు శిగపట్లు పడుతున్నాయి. ఒకరినొకరు పరస్పర విమర్శలు చేసుకోవడమే కాదు దాడులకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో వైసీపీ, బీజేపీ కట్టిన ఫ్లెక్సీలు గొడవలకు దారి తీసింది. రణస్థలం మండలం బంటుపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. రణస్థలం మండలం బంటుపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గ్రామంలో వైసీపీ, బీజేపీ పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గొడవకు దారి తీశాయి. బీజేపీ కట్టిన ఫ్లెక్సీలపైనే వైసీపీ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టారంటూ ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు పాల్పడ్డారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
ఎచ్చెర్ల నియెజకవర్గం టీడీపీలో క్రియాశీలక నేత మారిన రాజకీయ పరిస్దతుల నేపధ్యంలో బీజేపీలో చేరారు. బంటుపల్లిలో బీజేపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాత్రి వేళలలో మహిళల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఎమ్మెల్సీ మాదవ్ వచ్చారు. మాధవ్ సమక్షంలోనే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. పోలీసులకు, బీజీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇరు పార్టీల మధ్య గొడవలతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. బంటుపల్లి గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఇరు పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరించామని గొడవలు జరగకుండా కౌన్సిలింగ్ ఇచ్చామంటున్నారు రణస్థలం సీఐ హెచ్.రావు. ఎవరు గొడవలు ప్రేరేపించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు సంయమనంతో ఉండి గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.