వస్త్రదుకాణానికి అందరూ షాపింగ్ కోసం వస్తారు. కానీ ఓ దుకాణానికి అనుకోకుండా ఓ అతిథి వచ్చింది. ఆ షాపు యజమాని అతిథి మర్యాదలు నచ్చాయో ఏమో అప్పటి నుంచి రోజు క్రమం తప్పకుండా వస్తోంది. కడప జిల్లాలోని వస్త్రదుకాణంలో గోమాత రోజూ షాపింగ్కి రావడం ఇప్పుడు వైరల్గా మారింది.
మైదుకూరు పట్టణంలో ఓ ఆవు తీరు స్థానికుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మైదుకూరు వీధుల్లో కొన్ని ఆవులు తిరుగుతుంటాయి. కానీ ఆ ఆవు తీరే వేరు. స్థానిక సాయిబాబా క్లాత్ మార్కెట్లో ఓ వస్త్ర దుకాణంలోకి ఆ ఆవు ప్రతిరోజు వెళ్తుంది. షాపులో ఎందరున్నా అందర్నీ అడ్డుకుని ఆగకుండా లోపలికి వెళ్లి పాన్పుపై సేదతీరుతుంది. కొనుగోలు దారుల కోసం వేసిన మెత్తటి పరుపుపై ఫ్యాన్ కింద పవళిస్తుంది. ఆ ఆవు ఆ షాపులోకి ఒకసారి వచ్చాక కనీసం రెండు మూడు గంటల పాటు కదలకుండా విశ్రాంతి తీసుకుంటుంది.
షాప్లోకి వస్తున్న ఆవును తొలుత అడ్డుకోవాలని యజమాని ప్రయత్నం చేశాడు. తన బిజినెస్ దెబ్బతింటుందేమో అని ఆందోళనపడ్డాడు. కానీ ఆవు ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా సేదతీరడంతో యజమానితో పాటు, సిబ్బందికి, కొనుగోలుదారులకు అలవాటయ్యింది. అక్కడ ఎన్ని దుకాణాలు ఉన్నా, తమ దుకాణంలోకే ఆవు వస్తుందని, ఆహారం ఇస్తే ఎంచక్కా సేవిస్తుందని షాపు యజమాని తెలిపాడు. గోమాత వచ్చిన తర్వాత తమ వ్యాపారం కూడా అభివృద్ధి చెందిందని చెప్తున్నాడు యజమాని ఓబయ్య.