రాజధాని బంద్కు అమరావతి రైతులు పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల రైతులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాలని రాజధాని రైతుల కమిటి పిలుపునిచ్చింది. మూడు రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలని, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రాజధాని ఉద్యమం జరగాలని పిలుపునిచ్చారు. రోడ్ల దిగ్బంధం, వంటావార్పు, వెలగపూడిలో రీలే దీక్షలు చేయాలని నిర్ణయించారు. ఆందోళనల నేపథ్యంలో 144 సెక్షన్, సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉందని గుంటూరు పోలీసులు ప్రకటించారు.
రైతుల కమిటి ఇచ్చిన రాజధాని బంద్ పిలుపు మేరకు తుళ్లూరులో రైతులు రోడ్డెక్కారు. రోడ్లపై బైఠాయించారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానుల ఆలోచన విరమించుకోవాలంటున్నారు. రాజకీయాలకు తమను బలి చేయొద్దంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతల హామీ మేరకే తాము భూములిచ్చామని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.