'నేను శైలజ'తో తెలుగువారికి పరిచయమైన కథానాయిక కీర్తి సురేష్. ఆ తరువాత వచ్చిన 'నేను లోకల్'తో మరో హిట్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న కొత్త చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోంది కీర్తి. అలాగే మహానటి సావిత్రి బయోపిక్గా రూపొందుతున్న 'మహానటి'లో టైటిల్ రోల్ చేస్తోంది. తమిళంలోనూ సూర్యతో ఓ సినిమా చేస్తోందీ అమ్మడు.
ఇదిలా ఉంటే.. కీర్తికి సంక్రాంతి పండగ బాగా కలిసొస్తుంది. 2016లో శివకార్తీకేయన్తో జోడీ కట్టిన తమిళ చిత్రం 'రజనీ మురుగన్' సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధిస్తే.. 2017లో విజయ్కి జంటగా నటించిన తమిళ చిత్రం 'భైరవ' హిట్ చిత్రంగా నిలిచింది. ఇక 2018లోనూ సంక్రాంతికి కీర్తి హీరోయిన్గా మరో సినిమా రాబోతోంది. అయితే ఈ సారి తమిళంలో కాదు.. తెలుగులో. పవన్, త్రివిక్రమ్ల చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ముచ్చటగా మూడోసారి సంక్రాంతికి రానున్న కీర్తికి ఈ సారి కూడా హిట్ సినిమా పడుతుందేమో చూడాలి.