Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 19వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు సహా ఇతర బిల్లులు అసెంబ్లీ కౌన్సిల్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 11గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ శర్మ ప్రసంగం ఉంటుంది. దాదాపు గంటపాటు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. అనంతరం మరుసటి రోజుకు సభ వాయిదా పడుతుంది. ఈనెల 19వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే రెండు వారాలపాటు అంటే ఈనెల 27 వరకు సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకురానుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటితోపాటు ఇతర బిల్లులు కూడా అసెంబ్లీ, కౌన్సిల్ ముందుకు రానున్నాయి. పలు అంశాలు కూడా బడ్జెట్ సమావేవాల్లో చర్చకు రానున్నాయి.
ఇక అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్నిచర్యలు తీసుకుంటున్నారు. ఆందోళనకారులు ఎవరు కూడా అసెంబ్లీ సరిసరాల్లోకి రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అసెంబ్లీ సమావేశాలు సక్రమంగా సాగేందుకు సభ్యులు లెవనెత్తే అంశాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేటట్లు చూడాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు.