పాములు పట్టే వ్యక్తి.. అదే పాముకు బలైన హృదయవిదారక ఘటన.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం మర్పల్లి మండలం కొంశెట్టి పల్లి గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడిని నాగుపామును పట్టుకునే సమయంలో.. శ్రీనివాస్ అనే వ్యక్తి అదే పాము కాటుకు గురయ్యాడు. అయితే పాము విషం తలకెక్కి కళ్లు తిరగడంతో.. వెంటనే సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో.. వెంటనే అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు.
స్వతహాగా జంతు ప్రేమికుడైన శ్రీనివాస్ అలియాస్ ధనుష్.. సదాశివపేటలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థలో సభ్యుడిగా కొనసాగుతున్న శ్రీనివాస్, పాములను ప్రాణంగా ప్రేమిస్తాడు. ఎలాంటి పాములనైనా చేతులతో ఆటాడిస్తాడు. అలాంటి శ్రీనివాస్.. అదే పాము కాటుకు బలికావడంతో కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.