నేడు వరంగల్, హన్మకొండలో మంత్రి కేటీఆర్ పర్యటన
KTR: రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
నేడు వరంగల్, హన్మకొండలో మంత్రి కేటీఆర్ పర్యటన
KTR: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హన్మకొండకు హెలికాప్టర్లో వెళ్లనున్నారు. హన్మకొండలో 900 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో ప్రధానంగా హన్మకొండలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయం ఆవరణలో 100 కోట్లతో నిర్మించనున్న ఐటీ టవర్, 70 కోట్ల రూపాయలతో హన్మకొండ ఆర్టీసీ బస్స్టాండ్ ఆధునీకరణ, 10 కోట్లతో ఎంజీఎంలో ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్, 7 కోట్లతో నిర్మించిన ఆర్అండ్బీ గెస్ట్హౌస్తో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఉదయం 11.30 గంటలకు జరిగే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం 2.15 గంటలకు పోతన సబ్ స్టేషన్ వద్ద నూతనంగా నిర్మాణమైన లాండ్రో మార్ట్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు దూపకుంటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ సభల విజయవంతం చేయడానికి ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు అధికారులు సైతం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.