మంచిర్యాలలో దారుణం.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. పదేళ్ల ప్రేమ బంధం విషాదాంతం!

Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో గుండెలవబే దారుణం వెలుగుచూసింది.

Update: 2026-02-17 07:29 GMT

Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో గుండెలవబే దారుణం వెలుగుచూసింది. తరచూ జరుగుతున్న కుటుంబ కలహాలు చివరకు హత్యకు దారితీశాయి. భర్త వేధింపులు భరించలేక ఓ భార్య కత్తితో దాడి చేసి అతని ప్రాణాలు తీసింది.

పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మొయిన్ (42), సుక్కల అవంతి పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. అయితే, గత కొంతకాలంగా వీరి మధ్య సఖ్యత లేదు. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మొయిన్ తన భార్య అవంతిని తరచూ శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం.

మంగళవారం ఉదయం మరోసారి గొడవ జరగడంతో ఆవేశానికి గురైన అవంతి, ఇంట్లోని కత్తితో మొయిన్ మెడపై బలంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావంతో మొయిన్ అల్లాడిపోవడంతో స్థానికులు స్పందించి వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మొయిన్ మృతి చెందాడు.

ఘటన గురించి సమాచారం అందుకున్న మంచిర్యాల సీఐ రమేశ్, ఎస్సై నరేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు కటకటాల పాలు కావడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

Tags:    

Similar News