ప్రత్యర్థులను చిత్తు చేసేలా కేసీఆర్ కొత్త ఎత్తులు.. వ్యూహం అమలుకు ప్రగతి భవన్లో 6 వార్ రూమ్లు
KCR: ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఎత్తులకు పైఎత్తు. వ్యూహాలకు ప్రతి వ్యూహాలను పక్కాగా అమలు చేస్తేనే.. గెలుపు దరి చేరుతుంది.
ప్రత్యర్థులను చిత్తు చేసేలా కేసీఆర్ కొత్త ఎత్తులు.. వ్యూహం అమలుకు ప్రగతి భవన్లో 6 వార్ రూమ్లు
KCR: ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఎత్తులకు పైఎత్తు. వ్యూహాలకు ప్రతి వ్యూహాలను పక్కాగా అమలు చేస్తేనే.. గెలుపు దరి చేరుతుంది. పోల్ కురుక్షేత్రంలో పైచేయి సాధిస్తారు. మైండ్ గేమ్ను ప్లే చేయడంలో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్న కేసీఆర్...ఎన్నికల ముగింట మరో యాక్షన్ ప్లాన్కు సిద్ధం అయ్యారు. కాంగ్రెస్ను దెబ్బకొట్టేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేయబోతున్నారు. ప్రగతి భవన్ వేదికగా స్ట్రాటజీకి స్కెచ్ వేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది. బీఆర్ఎస్లో టికెట్ దక్కని అసంతృప్తులను చేర్చుకుని మరింతగా బలపడుతోంది కాంగ్రెస్. దీంతో హస్తాన్ని నిలువరించేందుకు..ఎన్నికల్లో చావు దెబ్బకొట్టేందుకు రంగంలోకి దిగారు కేసీఆర్. అటు నుంచి నరుక్కొచ్చే పనిలో పడ్డారు. కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడ్డ డీసీసీ చైర్మన్లే లక్ష్యంగా వల విసురుతున్నారు. వారిని బీఆర్ఎస్లో చేర్చుకోవడం లేదంటే.. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దింపే యోచనలో ఉన్నారట. రెబల్ అభ్యర్థితో కాంగ్రెస్ ఓట్లు చీలితే గులాబీ గెలుపు సునాయసం అవుతుందన్న ఎత్తుగడను ఇంప్లీమెంట్ చేస్తున్నారు. ఒకవేళ తిరుగుబాటు అభ్యర్థి గెలిస్తే.. పార్టీలో చేర్చుకొనే ప్లాన్ చేస్తున్నారట గులాబీ బాస్.
వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న కేసీఆర్ ఎన్నికల హోం వర్క్ లో బిజీ అయ్యారు. గెలుపే లక్ష్యంగా ప్రగతి భవన్లో ఆరు వార్ రూంల నుంచి కార్యాచరణ ప్రారంభించినట్టు సమాచారం. సెగ్మెంట్ల వారిగా సర్వే నివేదికలు పరిశీలిస్తూనే..బీఆర్ఎస్ వీక్ గా ఉన్న చోట్ల ప్రత్యర్థి అభ్యర్థి ఎవరు..? ఎలా దారికి తెచ్చుకోవాలి..? ఎవరిని రంగంలోకి దించితే పని జరుగుతుంది..? అనే అంశాలపై స్టడీ చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యూహరచన కొనసాగుతున్నదని తెలుస్తోంది. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులనే టార్గెట్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే మేడ్చల్ మల్కాజ్ గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ను పార్టీలో చేర్చుకున్న బీఆర్ఎస్. రెండు రోజుల వ్యవధిలోనే ఆయనకు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. మెదక్ టికెట్ ఆశించి భంగపడ్డ డీసీసీ చైర్మన్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. టికెట్ల రేసులో 13 మంది డీసీసీ చైర్మన్లున్నారు. వారిలో ఎంత మందికి టికెట్లు వచ్చే అవకాశం ఉంది.. రాని వారిని పార్టీలో చేర్చుకునేందుకు ఎవరి ద్వారా రాయబారం నడపాలి? వాళ్లకు సన్నిహితులెవరు..? అనే అంశాలపై డీప్ స్టడీ జరుగుతోందని సమాచారం.
ఇప్పటికే కొంత మంది డీసీసీ అధ్యక్షులను గులాబీ టీం కాంటాక్ట్ చేసిందని తెలుస్తోంది. పలువురు రాష్ట్ర స్థాయి నేతలు, సీనియర్లతోనూ మంతనాలు జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్ లో టికెట్ రాని వారిని తమవైపు తిప్పుకొనేందుకు గులాబీ బాస్ పావులు కదుపుతున్నట్టు సమాచారం. జాబితా విడుదలైన మరుక్షణం కండువా మార్చుకునేందుకు పలువురు ఇప్పటికే రెడీ అయిపోయారనే టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను రంగంలోకి దింపి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయించే మరో వ్యూహం కూడా గులాబీ పార్టీ అమ్ముల పొదిలో ఉందని తెలుస్తోంది. కీలక నేతలను తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దింపి.. ఖర్చులను కూడా సమకూర్చే స్ట్రాలజీ ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యూహం అమల్లోకి తేవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలహీన పడటం, ఓట్లు చీలడంతో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందన్న భావన గులాబీ బాస్ లో ఉంది. ఒకవేళ అలా జరగని పక్షంలో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన వ్యక్తి గెలిస్తే గులాబీ కండువా కప్పేందుకు ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా ఒకటి రెండు సీట్లు తగ్గినా ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.