Coronavirus outbreak in Telangana: తెలంగాణలో 11 వేలు దాటిన కేసులు.. జీహెచ్ఎంసీలో దుకాణాలన్ని స్వచ్ఛందంగా బంద్
Coronavirus outbreak in Telangana: తెలంగాణలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల భారీగా పెరిగిపోతోంది. జూన్ 25న రాష్ట్రంలో కొత్తగా 920 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల భారీగా పెరిగిపోతోంది. జూన్ 25న రాష్ట్రంలో కొత్తగా 920 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,364కు పెరిగింది. గత 24 గంటల్లో పాజిటివ్ కేసులు 920 నమోదు కాగా..అందులో 737 కేసులు కేవలం జీహెచ్ఎంసీలోనే వచ్చాయి.(Telangana corona virus out Break)
ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి వ్యాపార రంగాన్ని భారీగా దెబ్బతీసింది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూసి వ్యాపారులు దుకాణాలు తెరవాలంటేనే భయపడుతున్నారు.
కరోనా వ్యాప్తికి చెందకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మహమ్మారి మరింత విజృంభిస్తుందని దానికి కారణం తాము కాదనే భావనతో ఈనెల 26 నుంచి జులై 5 వరకు సికింద్రాబాద్లోని వస్త్ర దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు సికింద్రాబాద్ చేనేత, సిల్కు, వస్త్ర దుకాణదారుల సంఘ అధ్యక్షుడు టి.అశోక్కుమార్ చెప్పారు. సికింద్రాబాద్లోని జనరల్బజారులోని బంగారు, వెండి, వజ్రాభరణాల దుకాణదారులూ అదే బాటలో ఉన్నారు. సూర్యా టవర్స్, ప్యారడైజ్ ప్రాంతాల్లోని షాపులు కూడా మూసివేసే అలోచనలో ఉన్నారు. బేగంబజార్, ఫీల్ఖానా, సిద్ధిఅంబర్ బజార్, ఉస్మాన్గంజ్, ఎన్ఎస్ రోడ్డులోని హోల్సేల్ దుకాణదారులు కూడా బంద్ పాటిస్తున్నారు.
హోల్సేల్ మార్కెట్లన్నీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అమ్మకాలు కొనసాగించినట్లు హైదరాబాద్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్వ్యాస్ తెలిపారు. (హైదరాబాద్లోనే ఎందుకిన్ని కేసులు వస్తున్నాయ్.. అసలు ఈ నగరానికి ఏమైంది?)
తెలంగాణలో గురువారం కొత్తగా ఐదుగురు చనిపోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 230గా ఉంది. గత 24 గంటల్లో 3616 కరోనా టెస్టులు నిర్వహించగా, అందులో 2696 నెగిటివ్ వచ్చాయి. 920 పాజిటివ్ వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 70,934 కరోనా టెస్టులను నిర్వహించారు. అందులో 59570 నెగిటివ్ వచ్చాయి. 11364 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. వారిలో 4688 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 230 మంది చనిపోయారు. ప్రస్తుతం 6446 యాక్టివ్ కేసులు చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీలో పరిధిలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో గత కొన్ని రోజులుగా ప్రత్యేక క్యాంపుల్లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు కరోనా శాంపిల్స్ తీసుకోవడం నిలిచిపోనుంది.
ఈనెల 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు 36వేల శాంపిల్స్ను అధికారులు సేకరించారు. అలా సేకరించిన శాంపిల్స్ లో ఇంకా 8253 శాంపిల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఒక వ్యక్తి నుంచి కరోనా శాంపిల్ తీసుకుంటే, దాన్ని 48 గంటల లోపు పరీక్షించాలి. అప్పటి వరకు దాన్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. ప్రత్యేక క్యాంప్లు ఏర్పాటు చేసి శాంపిల్స్ సేకరించడం వల్ల ల్యాబ్స్లో పెద్ద ఎత్తున జమ అయ్యాయి. వాటిని నిల్వ చేయడం ఇబ్బందిగా మారింది.