Congress: తుక్కుగూడ జనజాతర విజయవంతంతో కాంగ్రెస్ జోష్

Congress: తెలంగాణలో ప్రజావిశ్వాసంతో అత్యధిక సీట్లు గెలుచుకోవాలనే వ్యూహం

Update: 2024-04-08 04:15 GMT

Congress: తుక్కుగూడ జనజాతర విజయవంతంతో కాంగ్రెస్ జోష్

Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల శంఖారావం విజయవంతంకావడంతో ఆపార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత కాంగ్రెస్ అధినాయకుడు రాహుల గాంధీని పిలిపించి ఆయన చేతులమీదుగా మరో ఐదు గ్యారంటీలతో తుక్కుగూడ సభ నిర్వహించడంలో సీఎం రేవంత్ రెడ్డి సఫలమయ్యారు. తుక్కుగూడ సభ జోష్‌తో రేవంత్ రెడ్డి లోక్ సభ నియోజకవర్గాలవారీగా పార్టీ నాయకులతో మాట్లాడి స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

క్షేత్రస్థాయిలో ప్రజల్లో విశ్వాసం పెంపొందించి, ఓట్లను రాబట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తుక్కుగూడ జనజాతర సభ విజయవంతమైన సంతృప్తిని పార్టీ శ్రేణులతో షేర్ చేసుకుంటూ... ప్రజల్లోకి వెళ్లి ఓట్లను రాబట్టాలని సీఎం రేవంత్ రెడ్డి, సహచర నాయకులకు దిశానిర్ధేశం చేశారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు సీట్లకు గానూ 14 గెలిచి తీరాలనే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. తెలంగాణనుంచి 14 స్థానాలను గెలిచి సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలనే సంకల్పంతో పనిచేయాలని నాయకులు, కార్యకర్తలను సమాయాత్తం చేశారు. లోక్ సభ నియోజకవర్గాలవారీ ఇన్ ఛార్జిలు, నాయకులతో సమీక్ష నిర్వహించారు.

వరంగల్‌, సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశమై గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని తెలుసుకున్నారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గం తరఫున అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్‌ రెడ్డి, వరంగల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరికి సీఎం రేవంత్‌ రెడ్డి గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు , కాంగ్రెస్ పార్టీకి సహకరించే విధంగా చేయాలని సూచించారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్‌ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న గ్యారంటీలను ప్రజలకు వివరించి మెజారిటీ ఓట్లతో విజయం సాధించాలని సూచించారు.

Tags:    

Similar News