Virat Kohli : విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ గల్లంతు.. 27 కోట్ల మంది ఫాలోవర్లలో కలకలం!
విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ గల్లంతు.. 27 కోట్ల మంది ఫాలోవర్లలో కలకలం!
Virat Kohli : టీమిండియా రన్మెషిన్, గ్లోబల్ ఐకాన్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా మాయమవ్వడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనవరి 29, 2026 రాత్రి నుంచి కోహ్లీ ప్రొఫైల్ సెర్చ్లో కనిపించకపోవడంతో 27.4 కోట్ల మంది ఫాలోవర్లు షాక్కు గురయ్యారు. కేవలం విరాట్ మాత్రమే కాదు, అతని సోదరుడు వికాస్ కోహ్లీ అకౌంట్ కూడా అదే సమయంలో అదృశ్యమవ్వడం ఈ మిస్టరీని మరింత పెంచింది. ప్రపంచంలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న క్రీడాకారుల జాబితాలో క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తర్వాత మూడో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ తన ఖాతాను అకస్మాత్తుగా మూసివేయడం సంచలనం సృష్టిస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచి కోహ్లీ ప్రొఫైల్ చూసేందుకు ప్రయత్నించిన వారికి దిస్ పేజీ ఈజ్ నాట్ అవైలబుల్ లేదా యూజర్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్లు వస్తున్నాయి. గతంలోనూ విరాట్ తన కుటుంబం కోసం, ప్రశాంతత కోసం సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చినప్పటికీ, ఏకంగా ఖాతాను డియాక్టివేట్ చేయడం ఇదే తొలిసారి.
విరాట్ కోహ్లీ ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ ముగించుకుని లండన్ వెళ్లారు. అక్కడ తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా, అకాయ్తో కలిసి సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే అకౌంట్ మాయమవ్వడం వెనుక ఏదైనా డిజిటల్ డిటాక్స్(సోషల్ మీడియాకు దూరం) కారణమై ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ ఖాతా కూడా అదే సమయంలో సెర్చ్లో కనిపించకపోవడంతో ఇది కేవలం యాదృచ్ఛికం కాదని, ఏదో బలమైన కారణం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
🚨 Virat Kohli and his brother, Vikas Kohli, have both deactivated their Instagram accounts.
— Selfless⁴⁵ (@SelflessCricket) January 29, 2026
I hope everything is fine. 🙏 pic.twitter.com/sMA7dPHcFx
మరోవైపు, ఇది కేవలం సాంకేతిక లోపం కావచ్చని కూడా విశ్లేషకులు అంటున్నారు. గతంలో చాలా మంది సెలబ్రిటీల ఖాతాలు ఇలాగే గ్లిచ్ వల్ల కనిపించకుండా పోయి, మళ్లీ తిరిగి వచ్చాయి. హ్యాకింగ్ జరిగి ఉండే అవకాశం తక్కువని, ఎందుకంటే విరాట్ వంటి భారీ అకౌంట్లకు ఇన్స్టాగ్రామ్ ప్రత్యేక భద్రత కల్పిస్తుందని తెలుస్తోంది. దీనిపై కోహ్లీ టీమ్ గానీ, మేనేజ్మెంట్ గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అభిమానులు మాత్రం అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్ పోస్టుల కింద ఛీకూ ఏమయ్యాడు? అంటూ వేల సంఖ్యలో కామెంట్లు పెడుతున్నారు.
విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక్కో ప్రమోషనల్ పోస్ట్కు కోట్లాది రూపాయల సంపాదనను గడిస్తున్నారు. అలాంటి విలువైన వేదికను ఆయన కావాలని వదులుకునే అవకాశం తక్కువని కొందరి అభిప్రాయం. అయితే, ప్రైవసీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే కోహ్లీ, తన పర్సనల్ లైఫ్ను సోషల్ మీడియా కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన ఎక్స్ ఖాతా మాత్రం ఇప్పటికీ యాక్టివ్గానే ఉంది, కానీ అక్కడ కూడా ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.