IND VS ENG: నేడు భారత్ - ఇంగ్లాండ్ సెమీస్ పోరు

* ఫైనల్ చేరెదెవరో? పాక్‌తో ఆడేదెవరో?

Update: 2022-11-10 04:18 GMT

 నేడు భారత్ - ఇంగ్లాండ్ సెమీస్ పోరు

India Vs England: టీ20 ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ ఇవాళ జరగనుంది. భారత్‌ జట్టు ఇంగ్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సూపర్‌-12లో అద్భుత ప్రతిభ కనబర్చిన భారత్‌ జట్టు ఫైనల్‌ బెర్తు కోసం బ్రిటీష్‌ జట్టుతో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్‌ భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరగనుంది. నాకౌట్‌ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకొని భారత బ్యాటింగ్‌ విభాగంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు లీగ్‌ దశలో మెరుగైన ప్రదర్శన కనబర్చడంలో విఫలమైన ఇంగ్లాండ్ సెమీస్‌లో స్థాయికి తగ్గట్టు రాణించాలని భావిస్తోంది. ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లాండ్‌పై ఇప్పటివరకూ మెరుగైన ఆటతీరు కనబర్చడం, భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతోంది.

దాదాపు నెలరోజులుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న మెగాటోర్నీలో ప్రపంచ విజేత ఎవరో మరో రెండు మ్యాచ్‌ల్లో తేలనుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌ను ఓడించిన పాకిస్థాన్‌ ఫైనల్‌ చేరగా, ఇంగ్లండ్‌తో అమీతుమీకి భారత్‌ అస్త్రశస్ర్తాలతో సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే అడిలైడ్‌లో రోహిత్‌సేన కొత్త చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తున్నది. సూపర్‌-12లో వరుస విజయాల జోరును కొనసాగిస్తూ కీలకమైన సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించేందుకు భారత్‌ పక్కా ప్రణాళికను ఎంచుకుంది. విన్నింగ్‌ కాంబినేషన్‌ను కొనసాగిస్తూ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉంటాయని ఇప్పటికే కెప్టెన్‌ రోహిత్‌ సూచనప్రాయంగా వెల్లడించిన నేపథ్యంలో తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొన్నది.

మరోవైపు మెగాటోర్నీలో పడుతూలేస్తున్న ఇంగ్లండ్‌ ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. ఐర్లాండ్‌తో అనూహ్య ఓటమితో కంగుతిన్న బట్లర్‌ గ్యాంగ్‌ న్యూజిలాండ్‌, శ్రీలంకపై విజయాలతో నాకౌట్‌ బెర్తు దక్కించుకుంది. ఆల్‌రౌండర్లతో బలంగా కనిపిస్తున్న ఇంగ్లిష్‌ జట్టు భారత్‌కు పోటీనిచ్చేందుకు పావులు కదుపుతున్నది. అడిలైడ్‌లో పరుగుల వరద పారించేందుకు ఇరు జట్ల బ్యాటర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News