భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ రద్దు చేయాలని పిటిషన్.. పిటిషనర్లపై సీరియస్ అయిన ద్విసభ్య ధర్మాసనం
Supreme Court Refuses Urgent Hearing on Plea to Cancel India-Pakistan Cricket Match
Supreme Court: భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను అత్యవసరం విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను అత్యవసరంగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడటం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరులతో పాటు సాయుధ దళాల త్యాగాలను తక్కువ చేస్తుందని చెప్పుకొచ్చారు.
పాకిస్తాన్తో మ్యాచ్ ఆడటం వల్ల మన సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేస్తుంటే... అదే దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నామనే వ్యతిరేక సందేశాన్ని పంపిందన్నారు. ఇది పాకిస్తాన్ ఉగ్రవాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాల మనోభావాలను కూడా దెబ్బతీస్తుందన్నారు. వినోదం కంటే దేశ గౌరవం, పౌరుల భద్రత ముఖ్యమని పిటిషన్లో పేర్కొన్నారు.
పిటిషన్ను జస్టిస్ మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అంత అత్యవసరం ఏంటి అని పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది. మ్యాచ్ ఈ ఆదివారమే ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇది రేపటి లిస్ట్లో లేకుండా పిటిషన్ పనికిరాకుండా పోతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆదివారమే మ్యాచ్ అంటున్నారు కదా... అది ఒక మ్యాచ్... అలా జరగనివ్వండని కోర్టు పేర్కొంది.