IND vs SL: రెండో టీ20లోనూ సూర్య సేనదే విజయం.. సిరీస్ని కైవసం చేసుకున్న భారత్
IND vs SL 2nd T20: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో డక్వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 7 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది.
IND vs SL: రెండో టీ20లోనూ సూర్య సేనదే విజయం.. సిరీస్ని కైవసం చేసుకున్న భారత్
IND vs SL 2nd T20: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో డక్వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 7 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. దీంతో భారత జట్టు మూడు మ్యాచ్ల సిరీస్ని మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో 8 ఓవర్లలో 78 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. కేవలం 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. ఈ విజయంతో భారత జట్టు సిరీస్లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ సిరీస్ విజయంతో శుభారంభం చేసింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అంతర్జాతీయ వేదికపై సిరీస్ విజయంతో కోచ్ కెరీర్ను ప్రారంభించాడు. సిరీస్లో మూడో, చివరి టీ20 మంగళవారం (జులై 30) పల్లెకెలెలో జరగనుంది.
యువ ఎడమచేతి వాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు వచ్చిన సంజూ శాంసన్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. శుభ్మన్ గిల్ స్థానంలో సంజూ ప్లేయింగ్ ఎలెవన్లో అవకాశం దక్కించుకున్నాడు. మెడ నొప్పి కారణంగా గిల్ ఈ మ్యాచ్లో పాల్గొనలేకపోయాడు. యశస్వి 30 పరుగులు చేయగా, కెప్టెన్ సూర్య 12 బంతుల్లో 26 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా 18 పరుగులతో నాటౌట్గా వెనుదిరగగా, పంత్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.
161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు స్కోరుకు 6 పరుగులు మాత్రమే చేరడంతో మళ్లీ వర్షం కురిసింది. ఆ తర్వాత భారత్ 3 బంతుల్లో వికెట్ నష్టపోకుండా ఈ పరుగులు చేసింది. అనంతరం సవరించిన లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులను టీమిండియా ఛేదించింది. ఈ మ్యాచ్లో టాస్ ఆలస్యంగా జరిగింది. వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ ఆలస్యమైంది.
లంకను 161/9కే పరిమితం చేసిన భారత బౌలర్లు..
భారత్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి శ్రీలంకను 9 వికెట్లకు 161 పరుగులకే పరిమితం చేశారు. శనివారం జరిగిన తొలి మ్యాచ్లో 21 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లు కోల్పోయిన శ్రీలంక ఆదివారం 31 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయింది. తొలి పది ఓవర్లలో 80 పరుగులు చేసినా.. పెద్దగా స్కోర్ చేయలేకపోయిన శ్రీలంక జట్టు చివరి పది ఓవర్లలో 81 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు, రవి బిష్ణోయ్ నాలుగు ఓవర్లలో 26 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశారు. శ్రీలంక తరపున పాతుమ్ నిస్సాంక 24 బంతుల్లో 32 పరుగులు చేయగా, కుశాల్ పెరీరా 34 బంతుల్లో 54 పరుగులు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్కు ఆరు ఓవర్లలో 54 పరుగులు జోడించారు.
10 డాట్ బాల్స్ బౌల్ చేసిన రియాన్ పరాగ్..
ఆ తర్వాత దాసున్ షనక (0), వనిందు హసరంగా (0) బాధ్యతా రహితమైన షాట్లు ఆడి ఔట్ అయ్యారు. ఒకానొక సమయంలో శ్రీలంక స్కోరు 15 ఓవర్లలో రెండు వికెట్లకు 130 పరుగులు కాగా, మిడిలార్డర్ తడబడడంతో పది బంతుల్లోనే నాలుగు వికెట్లు పడ్డాయి. అందులో ఒక రనౌట్ కూడా ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ను రంగంలోకి దింపాడు. అతను పది డాట్ బాల్స్తో సహా నాలుగు ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.