Rabandu Movie Trailer: రాబందు' ట్రైలర్ విడుదల: తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా లాంఛింగ్!
Rabandu Movie Trailer:
Rabandu Movie Trailer: శ్రీమతి పులిజాల నరసమ్మ సమర్పణలో, పులిజాల ఫిల్మ్స్ పతాకంపై రూపొందించిన క్రైమ్ ఎంటర్టైనర్ చిత్రం 'రాబందు' ట్రైలర్ విడుదల కార్యక్రమం నగరంలో ఘనంగా జరిగింది. ప్రీతి నిగమ్, రామ్, భాను ప్రసాద్, సురేష్ రాజ్, బ్రహ్మానందం రెడ్డి వంటి నటీనటులు నటించిన ఈ చిత్రానికి జయశేఖర్ కల్లు దర్శకత్వం వహించగా, పులిజాల సురేష్ నిర్మించారు.
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 'రాబందు' ట్రైలర్ను లాంఛనంగా విడుదల చేసి, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. అనంతరం, ప్రముఖ దర్శకుడు సముద్ర లిరికల్ సాంగ్ను విడుదల చేయగా, చిత్ర నటి ప్రీతి నిగమ్ టీజర్ను ఆవిష్కరించారు. సెన్సార్ బోర్డు సభ్యులు ఉపేంద్ర, రేణుకుమార్తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రసంగాలు:
నటి ప్రీతి నిగమ్: ట్రైలర్ చూసిన తర్వాత తనకు గూస్ బమ్స్ వచ్చాయని ప్రీతి నిగమ్ తెలిపారు. "రాబందు అనే పక్షి ఎంత పట్టుదలతో ఉంటుందో, ఈ సినిమా కథలో కూడా అదే పట్టుదల కనిపిస్తుంది. నిర్మాత సురేష్ గారు సినిమాపై ఉన్న ప్యాషన్తో తన కష్టార్జితాన్ని వెచ్చించి మంచి సినిమా తీశారు. ఇలాంటి నిర్మాతలను తప్పకుండా ప్రోత్సహించాలి. ప్రేక్షకులు దయచేసి థియేటర్కు వెళ్లి సినిమా చూడండి. తప్పకుండా ఒక మంచి సినిమా చూశామనే ఫీల్ కలుగుతుందని గట్టిగా చెప్పగలను," అని ఆమె కోరారు.
దర్శకుడు సముద్ర: 'రాబందు' దర్శకుడు జయశేఖర్ కల్లు తనకు మంచి మిత్రుడని, క్రైమ్ ఎంటర్టైన్మెంట్గా వస్తున్న ఈ సినిమా ఆయనకు నాలుగో చిత్రమని దర్శకుడు సముద్ర తెలిపారు. "యానిమల్ సినిమా తరహాలో 'రాబందు' టైటిల్ చాలా మాస్గా ఉంది. టైటిల్కు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా వైలెంట్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి జీవితాన్ని, నిర్మాతకు, దర్శకుడికి ఘన విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను," అని సముద్ర ఆకాంక్షించారు.
చిత్ర నిర్మాత పులిజాల సురేష్: ట్రైలర్, పాటలు, టీజర్ను విడుదల చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దర్శకుడు సముద్ర, నటి ప్రీతి నిగమ్లకు నిర్మాత పులిజాల సురేష్ ధన్యవాదాలు తెలిపారు. "మంచి కథతో, సందేశాత్మకంగా ఈ సినిమాను దర్శకుడు జయశేఖర్ చాలా బాగా తెరకెక్కించారు. అనుకున్నదానికంటే సినిమా బాగా వచ్చింది. త్వరలో విడుదల అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి హిట్ చేయాలని కోరుకుంటున్నాను," అన్నారు.
చిత్ర దర్శకుడు జయశేఖర్ కల్లు: "నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని, భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో పులిజాల ఫిల్మ్స్ బ్యానర్పై 'రాబందు' చిత్రాన్ని నిర్మించాం. మా ట్రైలర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేయించి వారి ఆశీర్వచనాలు పొందాం. నన్ను నమ్మి సినిమా అప్పగించిన నిర్మాత సురేష్ గారికి కృతజ్ఞతలు. మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను," అని జయశేఖర్ కల్లు విన్నవించారు.
సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేంద్ర: ట్రైలర్ చూస్తే రూ. 100 కోట్లు పెట్టి తీసిన సినిమా ఎఫెక్ట్స్ కనిపించాయని ఉపేంద్ర ప్రశంసించారు. "నిర్మాత సురేష్ గారు ఇంత పెద్ద సినిమా తీయడానికి ధైర్యం చేయడం ఆశ్చర్యం కలిగించింది. దర్శకుడు జయశేఖర్ మంచి క్రియేటర్, మేధావి. వీరి కాంబినేషన్ రామలక్ష్మణులలాగా చక్కగా కుదిరింది. ఇందులో నటించిన ప్రీతి మీనన్ గారు, జబర్దస్త్ టీం సభ్యులతో పాటు కొత్త నటీనటులు చాలా బాగా నటించారు. ఈ సినిమా నిర్మాతకు ఆర్థికంగా లాభాలు, మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటున్నాను," అని అన్నారు.
హీరో రామ్, నటుడు రాజశేఖర్: ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత, దర్శకులకు కృతజ్ఞతలు తెలిపారు హీరో రామ్. కొత్త రకం కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని తాను హీరో ఫాదర్ పాత్ర పోషించిన రాజశేఖర్ ఆకాంక్షించారు.