ట్రంప్తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ.. మీడియాను అనుమతించకుండా సీక్రెట్ టాక్స్..
అమెరికా, పాకిస్థాన్ రోజురోజుకీ మరింత చేరువవుతున్నాయి. మొన్నామధ్య పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. అగ్రరాజ్యంలో పర్యటించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో వీరి మధ్య అంతర్గత సమావేశం జరిగింది. షరీఫ్ వెంట మునీర్ కూడా ఉన్నారు. ఈ భేటీకి మీడియాను అనుమతించకపోవడం గమనార్హం. అమెరికా కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 4.52 గంటలకు పాక్ ప్రధాని షరీఫ్ బృందం వైట్హౌస్కు చేరుకుంది. అదే సమయంలో ట్రంప్ మీడియా సమావేశం జరుగుతుండడంతో దాదాపు గంట పాటు అమెరికా అధ్యక్షుడి కోసం పాక్ నేతలు ఎదురుచూశారు. అటు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. షరీఫ్ గురించి ప్రస్తావించారు. ఆయనో గొప్ప నేత, గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. అనంతరం ఓవల్ ఆఫీసుకు వెళ్లి పాక్ ప్రధానితో ట్రంప్ భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, ఈ భేటీలో వీరు ఏం చర్చించారన్న దానిపై స్పష్టత లేదు.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ట్రంప్ భేటీలో ఏం జరిగింది.. ఏం మాట్లాడారు అన్నదానిపై స్పష్టత లేదు.. మీడియాకు అనుమతించకపోవడంతో అనేక అనుమానాలు ఉన్నాయి.. వీరద్దరూ.. వైట్ హౌస్ లో సమావేశం కావడం ఇదే తొలిసారి. 2019లో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. అంతకుముందు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ 2015లో అమెరికాలో పర్యటించారు. ఇక, ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా వెళ్లినప్పుడు ఆయనకు శ్వేతసౌధంలో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటనను భారత్ నిశితంగా గమనిస్తోంది. దీని పరిణామాలపై అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తోంది.