Population: భారత్ జనాభా 142.86కోట్లు.. చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!
Population: 29లక్షల అధిక జనాభాతో చైనాను అధిగమించిన భారత్
Population: భారత్ జనాభా 142.86కోట్లు.. చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!
Population: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29లక్షల అధిక జానాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది.
జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023 పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ తాజా నివేదికను విడుదల చేసింది. భారత్లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్లు లెక్కకట్టింది. మనతో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57కోట్లుగా అంచనా వేసింది. ఇక ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది.
ప్రపంచ జనాభా 804.5కోట్లుగా అంచనా వేయగా అందులో మూడులో ఒకటో వంతు జనాభా కేవలం భారత్, చైనాలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొంతకాలంగా చైనాలో జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గగా.. భారత్లో కొంతమేరకు తగ్గుదల కనిపిస్తోంది. 2011 నుంచి భారత జనాభాలో సరాసరి 1.2శాతం పెరుగుతూ వస్తుండగా.. అంతకుముందు పదేళ్లు మాత్రం ఈ పెరుగుదల 1.7శాతంగా ఉంది. గతేడాది చైనా గణాంకాల ప్రకారం, అక్కడ గత ఆరు దశాబ్దాల్లో తొలిసారి భారీగా జనాభా క్షీణించినట్లు వెల్లడైంది.
గతంలో యూఎన్తోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన నివేదికలను బట్టి చూస్తే ఏప్రిల్లోనే ఈ రికార్టు నెలకొల్పనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్లో 2011లో జనగణన జరిగింది. తిరిగి 2021లో వాటిని చేపట్టాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా జాప్యమైంది.
భారత్లో జనాభా వేగంగా పెరుగడంపై సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తోందని తాజా సర్వేలో తేలిందని యూఎన్ఎఫ్పీఏ భారత ప్రతినిధి ఆండ్రియా వొజ్నార్ పేర్కొన్నారు. అయితే, జనాభా పెరుగుదల అనేది ఆందోళన అంశంగా చూసే బదులు పురోగతి, అభివృద్ధి, వ్యక్తిగత హక్కులు, మరిన్ని అవకాశాలకు చిహ్నంగా చూడాలని ఆండ్రియా అభిప్రాయపడ్డారు.