కన్నడ చిత్రంతో కెరీర్ని మొదలుపెట్టిన ఉత్తరాది భామ రకుల్ ప్రీత్సింగ్.. ఆ తరువాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. అయితే తెలుగులో మాత్రమే ఈ ముద్దుగుమ్మకి స్టార్డమ్ దక్కింది. తెలుగు తరువాత రకుల్ ఎక్కువగా నటించింది తమిళ చిత్రాల్లోనే. అయితే అక్కడ ఆమెకి పెద్ద గుర్తింపు అయితే దక్కలేదు. 'అలా మొదలైంది' రీమేక్ అయిన 'ఎన్నమో ఏదో' తరువాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని రెండు తమిళ చిత్రాలతో పలకరించబోతోంది రకుల్. ఆ చిత్రాలే 'స్పైడర్', 'దీరన్ అధిగారం ఒండ్రు'. వీటిలో ముందుగా 'స్పైడర్' థియేటర్లలో సందడి చేయనుంది.
తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా విడుదల కానున్న 'స్పైడర్'పై భారీ ఆశలనే పెట్టుకుంది రకుల్. మూడేళ్ల తరువాత తమిళనాట రీ ఎంట్రీ ఇస్తున్న తనకి 'స్పైడర్' రూపంలో మంచి అవకాశం వచ్చిందని.. మహేష్, మురుగదాస్, హేరిస్ జైరాజ్, సంతోష్ శివన్ వంటి హేమాహేమీలున్న సినిమాతో వస్తున్న తనకి.. ఈ సినిమా మంచి పేరు తీసుకువస్తుందన్న నమ్మకం ఉందని చెప్పిందీ ముద్దుగుమ్మ. ఈ నెల 27న 'స్పైడర్' రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.