మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్. 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్' వంటి విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకున్న సాయి ధరమ్కి.. 'తిక్క', 'విన్నర్', 'నక్షత్రం' రూపంలో వరుస పరాజయాలు పలకరించాయి. ఈ నేపథ్యంలో సాయిధరమ్కి అర్జంట్గా ఓ హిట్ సినిమా కావాలి.
సాయి ధరమ్ కొత్త చిత్రం 'జవాన్' విడుదలకు సిద్ధం కాగా.. మరో రెండు చిత్రాలు ఇటీవలే సెట్స్ పైకి వెళ్లాయి. వాటిలో ఒక సినిమాకి వి.వి.వినాయక్ దర్శకుడు కాగా.. మరో సినిమాకి ఎ.కరుణాకరన్ దర్శకుడు. చిరంజీవితో 'ఠాగూర్', 'ఖైదీ నెం.150' వంటి హిట్ చిత్రాలు తీసిన ఘనత వినాయక్ ది అయితే.. పవన్ కళ్యాణ్తో 'తొలి ప్రేమ' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రూపొందించిన ఘనత కరుణాకరన్ది. మరి మావయ్యలకి హిట్ ఇచ్చిన దర్శకులతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సాయి.. ఆయా చిత్రాలతో హిట్ కొడతాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.